
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టే.
ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.
ఓటర్లకు ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికో ఒకరికి ఓటువేయాలనే ఉద్ధ్దేశంతో ఓటు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే నోటా ద్వారా తమ తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్లకన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అయితే నోటా అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ఉన్నదనే విషయం కనీసం ఓటరుకు తెలియదు. ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్లగానే ఈవీఎంలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులే కనిపిస్తాయి. అభిప్రాయాన్ని యువ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు.
అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు ఇది ఇబ్బందికరమని, నోటా ఉందనే విషయం తెలిసే విధంగా ఏదైన గుర్తు కేటాయిస్తే బాగుంటుందనే ప్రముఖ రచయిత సౌదా అరుణ హైకోర్టులో ‘పిల్’ దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, ‘నోటా’కు గుర్తు కేటాయించాలని, వీలైతే ఈ ఎన్నికల్లోనే కేటాయించాలని ఎన్నికల కమిషన్కు సూచించింది